indra simhasanam
ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు.
యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను" అన్నాడు వినయంగా.
"సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి". జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే.
"సర్పయాగం ఆగిపోయింది".
యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు. "జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు నిండిన మనస్సులోకి వెలుగు చొరబడదు. బుద్ధినీ, అంతరంగాన్నీ విశాలం చేసుకో" అని ఆస్తీకుడు జనమేజయుడికి ఉపదేశించాడు.
జనమేజయుడికి జ్ఞానోదయమైంది.
జనమేజయుడు సర్పయాగం నిలుపుచేసిన తరువాత అశ్వమేధయాగం చేశాడు. వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమేజయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు. "నీ తండ్రిని నీకు చూపిస్తానుండమ"ని స్వర్గంలో ఉన్న పరీక్షిత్తుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు.
అంతే!!
పరీక్షిత్తు మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమేజయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
జనమేజయుడి ఆనందానికి అవధుల్లేవు. వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు. తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెనువెంటనే అంతర్హితుడయ్యాడు.
వ్యాసమహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదీ జనమేజయుడి కథ.
ఈ జనమేజయుడికే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు.
కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసాక దాదాపు ముప్ఫయి ఆరేళ్ళు పాండవులు రాజ్యపాలన చేశారు. అనంతరం పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. పరీక్షిత్తు సుమారు అరవై సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఆ తరువాత జనమేజయుడు పరిపాలించాడు.
0 comments:
Post a Comment